న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) తగ్గింపుల వల్ల కలిగే లాభాలను తప్పనిసరిగా వినియోగదారులకు చేరేలా చూడాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఇఇపిసి ఇండియా ప్లాటినం జూబ్లీ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఐటి మంత్రి జితిన్‌ ప్రసాద్, మంత్రి పియూష్‌ గోయల్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, జిఎస్‌టి శ్లాబుల తగ్గింపు పరిశ్రమలు, వాణిజ్యానికి బలాన్నిస్తుందని తెలిపారు. సరళీకరణ, రేటు తగ్గింపులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు.

కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రజలు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుందని గోయల్‌ అభిప్రాయపడ్డారు.

జిఎస్‌టి శ్లాబులను 5 శాతం, 18 శాతం వరకు కుదించిన విషయం తెలిసిందే.