క్రిమినల్‌ కేసులను విచారించకుండా అలహాబాద్‌ హైకోర్టు జడ్జీపై విధించిన నిషేధపు ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌పై అభ్యంతరకరమైనవిగా గుర్తించబడిన వ్యాఖ్యలను కూడా కోర్టు తొలగించి, ఈ విషయాన్ని ఇక్కడితో నిలిపివేస్తున్నామని పేర్కొంది. సివిల్‌ విషయంలో జారీ చేసిన క్రిమినల్‌ సమన్లను సమర్థిస్తూ జస్టిస్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై ఆగస్టు 4న జారీ చేసిన ఉత్తర్వుల్లో జస్టిస్‌ జె.బి.పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆయనను క్రిమినల్‌ కేసులు విచారించకుండా నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులను పున:పరిశీలించాలని సిజెఐ గవాయి లేఖ రాసిన తర్వాత ధర్మాసనం తన తీర్పును పక్కనపెట్టింది. మా మునుపటి ఉత్తర్వుల్లో జారీ చేసిన ఆదేశాలను పున:పరిశీలించాలని కోరుతూ సిజెఐ నుండి తమకు లేఖ అందిందని ధర్మాసనం పేర్కొంది. తాము ఈ అభ్యంతరకరమైన ఉత్తర్వును పక్కన పెట్టి హైకోర్టులో తాజా విచారణ కోసం పంపామని తెలిపింది.